1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (17:51 IST)

హస్తినలో భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం... ఎస్పీ ఎంపీకి వీఐపీ లిఫ్టింగ్

ram gopal yadav
దేశ రాజధాని హస్తినలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ కారణంగా అనేక మంది నీటిలో చిక్కుకున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ పార్లమెంట్ సభ్యులంతా ఢిల్లీలోనే ఉన్నారు. అయితే, భారీ వర్షాల దెబ్బకు వర్షపు నీరు వారి నివాస గృహాల్లోకి కూడా చేరింది. ఢిల్లీలో నీటి ఎద్దడి పరిష్కరించాలంటూ ఇటీవల నిరాహారదీక్ష చేసిన ఆప్‌ నేత, ఢిల్లీ జలమంత్రి ఆతిశీ ఇల్లు కూడా నీటిలో ఉంది. తన ఇంట్లోని సామాన్లన్నీ పాడైపోయాయని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌ ఎక్స్‌(ట్విటర్) వేదికగా వెల్లడించారు.
 
'నేను నిద్రలేచేసరికి అన్ని గదులు నీటితో నిండిపోయాయి. కార్పెట్స్‌, ఫర్నిచర్‌ సహా నేలమీద ఉన్న సామాన్లన్నీ పాడైపోయాయి. డ్రైనేజీలు మూసుకుపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సమయంలో కరెంట్‌ షాక్‌లను నివారించేందుకు ఉదయం ఆరు గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు' అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తాను పార్లమెంట్‌కు సమయానికి వచ్చానని చెప్పారు.
 
మరోవైపు, ఈ వర్షాలతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్‌ గోపాల్ యాదవ్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. లోథి ఎస్టేట్ ప్రాంతంలోని నివాసం వద్ద నీరు నిలవడంతో సిబ్బంది ఆయన్ను ఎత్తుకొని కారులో కూర్చోపెట్టారు. పార్లమెంట్‌కు వెళ్లేందుకే ఇదంతా అని యాదవ్ వెల్లడించారు. తన ఇల్లంతా నీటితో నిండిపోయిందని, రెండు రోజుల క్రితం చేసిన ఫ్లోరింగ్ అంతా పాడైపోయిందని చెప్పారు. ఫ్లోరింగ్ కోసం వెచ్చించిన సొమ్మంతా వృథా అయిందన్నారు. నీటిని తోడేందుకు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి ఫోన్ చేసిన ప్రయోజనం లేకపోయిందన్నారు.