1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (14:56 IST)

భారీ వర్షాలకు నీట మునిగిన అయోధ్య నగరం... యూపీలో బీజేపీ పాలనపై నెటిజన్ల సెటైర్లు (Video)

ayodhya city
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా, దేశానికే తలమానికంగా ఉండే అయోధ్య నగరం దాదాపుగా నీట మునిగింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా అయోధ్య నగర వాసులతో పాటు భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అద్భుత పరిపాలన ఇదేనంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 
 
ముఖ్యంగా, అయోధ్య రామ మందిరం సమీపంలోని నివాసాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు నీటిలో మునిగిపోయాయి. స్థానికులు మోకాళ్లలోతు నీటిలో నడుస్తూ ఇళ్లకు చేరుకుంటున్నారు. వర్షం పడిన ప్రతిసారీ తమకు ఈ తిప్పలు తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర దర్శనానికి వచ్చే భక్తుల కష్టాలకు లెక్కే లేకుండా పోయిందని వారుపోతున్నారు. రోజుకు 2 వేల నుంచి 3 వేల మంది వరకు భక్తులు అయోధ్య మందిర దర్శనానికి వస్తుంటారని, వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. 
 
వీధులు పూర్తిగా బురదమయంగా ఉండటంతో బైకులు, ఇతర వాహనాలు వీధుల్లోకి రాలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, భవన నిర్మాణాల ప్లాన్లలోనూ చాలా లోపాలు ఉన్నాయని, ఇవన్నీ అయోధ్య నగరాన్ని దారుణంగా మారుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వీధుల్లో మోకాళ్ల లోతులో చేరిన నీరుతో రామమందిర పరిసర ప్రదేశాలు బురదమయంగా, అడుగు కూడా వేయలేనంతగా ఉన్న దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాముడు తమ వాడని, అయోధ్యను తాము కట్టామని గొప్పగా చెప్పుకునే బీజేపీ పదేళ్ల పాలనకు ఈ వీడియో నిలువెత్తు నిదర్శనమని విమర్శిస్తున్నారు.