1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 జూన్ 2025 (19:47 IST)

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

air india crash plane
ఇటీవల గుజరాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఎయిరిండియా విమానాల్లో భద్రతా ప్రమాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దేశ వ్యాప్తంగా విమానయాన భద్రతపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా నిర్వహించిన తనిఖీల్లో పలు ప్రధాన విమానాశ్రయాల్లో విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలు ఉన్నట్టు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. విమానాలు, రన్‌వేలు సహా పలు కీలక విభాగాల్లో ఈ సమస్యలు ఉన్నాయని డీజీసీఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 
 
డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని రెండు ప్రత్యేక బృందాలు ఇటీవల ఢిల్లీ, ముంబై వంటి దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో సమగ్రమైన తనిఖీలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో భాగంగా, ఫ్లైట్ ఆపరేషన్స్, ర్యాంప్ సేఫ్టీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ అండ్ నేవిగేషన్ పరికరాలు, విమానం ఎక్కే ముందు సిబ్బందికి నిర్వహించే వైద్య పరీక్షలు వంటి అనేక కీలక అంశాలను నిశితంగా పరిశీలించినట్టు అధికారులు తెలిపారు. 
 
లోపాలు ఉన్న విమానయాన సంస్థలు లేదా ఇతర విభాగాల పేర్లను డీజీసీఏ ప్రస్తుతానికి బయటపెట్టలేదు. అయితే, గుర్తించిన లోపాలన్నింటినీ సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్ళామని తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు డీజీసీఏ స్పష్టం చేసింది. విమాన ప్రమాణాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని అధికారులు తెలిపారు.