శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (07:44 IST)

రాజకీయాలకు దూరం: జనరల్‌ బిపిన్‌ రావత్‌

తాము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటామని, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఆదేశాల ప్రకారం పని చేస్తామని భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ తేల్చిచెప్పారు.

త్రివిధ దళాలకు చెందిన మంచి ఆర్థిక వనరులపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన చెప్పారు. దళాల ఏకీకరణపై దృష్టి పెడతామని, శిక్షణను ఎలా ఏకీకరణ చేయాలన్న దానిపై దృష్టి సారిస్తామన్నారు. భారత త్రిదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ జాతీయ యుద్ధ స్మారకం చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

అనంతరం ఆయన సైనిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జనరల్‌ బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ.. సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఒక జట్టుగా కలిసి పని చేస్తాయన్నారు.

ఇంకా ఏమైనా అదనపు బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. త్రివిధ ధళాల మధ్య సమన్వయం, వనరుల ఏకీకరణ తన లక్ష్యమని జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు.
 
రక్షణ మంత్రితో సమావేశం
క్షణ దళాల అధిపతి (సీడీఎస్)గా నూతన బాధ్యతలు చేపట్టిన జనరల్ బిపిన్ రావత్ ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జనరల్ రావత్‌కు రక్షణ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఆర్మీ చీఫ్‌గా నిన్న పదవీ విరమణ పొందిన జనరల్ రావత్... ఇవాళ సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా త్రివిధ దళాలు ఆయనకు ఘనంగా గౌరవ వందనం సమర్పించాయి. కాగా తొలి సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జనరల్ రావత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం ప్రారంభమవుతున్న తరుణంలో భారత దేశానికి మొదటి సీడీఎస్ వచ్చారన్నారు. జనరల్ రావత్ భారత దేశానికి గొప్ప శక్తియుక్తులతో, ఉత్సాహంతో సేవలు చేశారని మోదీ ప్రశంసలు కురిపించారు.