1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (17:04 IST)

మన్మోహన్ సింగ్‌కు మొండిచేయి చూపిన ఎంకే స్టాలిన్!

మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‍కు డీఎంకే అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్ మొండిచేయి చూపించారు. పైగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వినతిని కూడా తోసిపుచ్చారు.
 
మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోయింది. దీంతో ఆయన్ను తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇందుకోసం మిత్రపక్షమైన డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి చేశారు. డీఎంకే కోటాలో ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో ఒక్క సీటును మన్మోహన్ సింగ్‌కు కేటాయించాలని కోరారు. అయితే, రాహుల్ వినతిని స్టాలిన్ నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. 
 
పైగా, తమ పార్టీకి చెందిన ఇద్దరు నేతల పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. వీరిలో ఒకరు న్యాయవాది విల్సన్ కాగా, మరొకరు సీనియర్ నేత షణ్ముగంలు ఉన్నారు. ఇంకోసీటును సంకీర్ణ భాగస్వామి వైకోకు ఇవ్వనున్నారు. 
 
డీఎంకే - ఎండీఎంకే పార్టీల మధ్య ఈ అవగాహన ఎన్నికలకు ముందే కుదిరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ద్వైవార్షిక కోటాలో ఖాళీ అయ్యే సీట్లలో భాగంగా ఈ రాష్ట్రం నుంచి 6 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో నాలుగు అధికార అన్నా డీఎంకే నాయకులు కాగా, ఒకరు డీఎంకే నుంచి, మరొకరు సీపీఐ సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. 
 
డీఎంకే సభ్యురాలు కనిమొళి కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమె ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. దీంతో ఈ స్థానం కూడా ఖాళీగా ఉంది.