శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (19:47 IST)

ఆ నలుగురుపై అనర్హత వేటు వేయండి : టీడీపీ ఎంపీలు

తమ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులపై అనర్హత వేటు వేయాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ ఎంపీలైన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, సీతారామలక్ష్మిలు వినతిపత్రం సమర్పించారు. 
 
టీడీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ (ఆంధ్రప్రదేశ్), గరికపాటి రామ్మోహన్ రావు (తెలంగాణ)లు గురువారం బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఈ నలుగురు బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
 
ఈ నేపథ్యంలో పార్టీ మారిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయాలంటూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు టీడీపీ నేతలు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బీజేపీలో టీడీపీ రాజ్యసభాపక్షం విలీనం చెల్లదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. విలీనం అంశాన్ని తప్పుబట్టిన వారు ....పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తాము విలీనం కోరుతూ ఎలాంటి తీర‍్మానం చేయలేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మరోవైపు, పార్టీ మారిన ఎంపీలు బీజేపీ సభ్యులే అంటూ రాజ్యసభ వెబ్‌సైట్‌లో అధికారికంగా పేర్కొనడం జరిగింది.