శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శుక్రవారం, 21 జూన్ 2019 (15:03 IST)

తెదేపా మెడలో గంట కట్టనున్న గంటా... బాబు తిరిగొచ్చేదాకా తెదేపా వుంటుందా?

తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో వున్నారు. ఆయన ఆ పర్యటనలో వుండగానే ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. తెదేపా రాజ్యసభ సభ్యులు ఇప్పటికే పార్టీతో సహా భాజపాలో చేరిపోయారు. ఇక భాజపా తాజా టార్గెట్ ఏపీ తెదేపా ఎమ్మెల్యేలే. 
 
ఇప్పటికే రాజ్యసభ సభ్యులను పార్టీలో చేర్చుకుని రాజ్యసభలో తెదేపా ప్రాతినిధ్యం లేకుండా చేసేసింది. ఇక ఇప్పుడు దాని కన్ను ఏపీ అసెంబ్లీలోని తెదేపా ఎమ్మెల్యేలపై పడింది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా తృతీయ శక్తిని కూడగట్టేందుకు ప్రయత్నాలు చేశారు. 
 
దీన్ని మనసులో పెట్టుకున్న భాజపా చంద్రబాబుకి దెబ్బకి దెబ్బ తీయాలన్న గట్టి నిర్ణయంతో వున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే తెదేపాకి చెందిన రాజ్యసభ సభ్యులను లాగేసింది. తాజాగా ఎమ్మెల్యేలను కూడా లాగేస్తే ఓ పనైపోతుందని భాజపా తగిన రీతిలో పావులు కదుపుతోంది. మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్యర్యంలో పని పూర్తి చేయాలని ప్లాన్లు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం సాయంత్రానికి గంటా నేరుగా భాజపా ఆఫీసుకి వెళ్లి పార్టీ తీర్థం పుచ్చుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది.
 
కాగా వైసీపి అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి తెదేపాకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో వున్నారనీ, ఐతే వారిని చేర్చుకోవాలంటే వారు తమ పదవులకి రాజీనామా చేసి రావాల్సిందేనని కండిషన్ పెట్టారు. దీనితో ఇక తెదేపా ఎమ్మెల్యేల్లో ఎవరైనా గోడ దూకాలంటే వైసీపితో పనికాదు. కాబట్టి కేంద్రంలో అధికారంలో వున్న భాజపా వారికి దిక్కు. అందువల్ల కొందరు ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
పైగా వచ్చే ఐదేళ్లపాటు అధికారానికి దూరంగా వుండాలంటే చాలా కష్టం. అభివృద్ధి సంగతేమోగానీ కనీసం సొంత పనులు కూడా చేసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. అందువల్ల తెదేపాను వీడేందుకు కొందరు మొగ్గుచూపుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఐతే నలుగురైదుగురు ఎమ్మెల్యేలు వచ్చినా ప్రయోజనం వుండదనీ, 23 మంది ఎమ్మెల్యేల్లో కనీసం 15 మంది ఎమ్మెల్యేలను తమవైపు లాక్కోవాలని భాజపా ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. అదే జరిగితే చంద్రబాబు నాయుడుకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. కేవలం సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కొనసాగాల్సి వుంటుంది. 
 
15 మందికిపైగా తెదేపా శాసనసభ్యులు పార్టీ మారితే... రాజ్యసభ సభ్యులు మాదిరిగా వీరు కూడా తమ పార్టీని భాజపాలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేస్తే... ఇక తెదేపా పని మటాష్. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ఏపీకి వచ్చేలోపు పార్టీ వుంటుందో వుండదోననే కామెంట్లు వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సిందే.