శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 6 జులై 2019 (19:17 IST)

తీరప్రాంత రక్షకులుగా 177 మంది కేరళ మత్స్యకారులు..

కేరళను 2018లో భారీ వరదలు ముంచెత్తాయి. శతాబ్ధంలోనే అతిపెద్ద వరదలు సంభవించాయి. ఈ వరదల సమయంలో జాలర్లు హీరోలుగా మారారు. రాష్ట్రం మొత్తం వరద నీటితో నిండిపోయిన తరుణంలో జాలర్లు పడవలు, బ్యాగులతో ఇళ్లల్లో చిక్కుకుపోయిన లక్షలాది మందిని కాపాడారు. విపత్తు సమయాల్లో ప్రజలను కాపాడటంలో ఎలాంటి అధికారిక శిక్షణ లేని మత్స్య కారులు శిక్షణ పొందిన మహాశక్తిలా వ్యవహరించారు. 
 
ఎన్‌డిఆర్‌ఎఫ్, నేవీ బోట్లు చేరుకోలేని మారుమూల ప్రాంతాలకు చేరుకుని లక్షలాది మందిని రక్షించారు. వరద బాధితులకు ఆహారం, అత్యావసర వస్తుసామగ్రిని అందించారు. ఇలా నిస్వార్థంగా సేవ చేసిన మత్స్యకారులను యావత్తు దేశం ప్రశంసలతో కొనియాడింది. ఇక కేరళ సీఎం పినరయి విజయన్ వారిని కేరళకు చెందిన సొంత సైన్యంగా అభివర్ణించారు. వీరి వీరోచత చర్యల కారణంగా ఏడాది తర్వాత కేరళ మత్స్యకారులు అధికారికంగా తీర ప్రాంత రక్షకుల దళంలో చేరారు.
 
కేరళ తీర ప్రాంతాలకు చెందిన మొత్తం 177 మంది మత్స్యకారులను కేరళ పోలీసు శాఖలో చేర్పించారు. పోలిసింగ్‌లో వివిధ కోణాల్లో శిక్షణ పొందిన మత్స్యకారులు ఇప్పుడు కేరళ తీర పోలీసుల్లో భాగం అయ్యారు. శనివారం, సిఎం విజయన్ సమక్షంలో వారిని అధికారికంగా తీర ప్రాంత రక్షకులుగా ప్రకటించారు.
 
మత్స్యకారులకు కోస్ట్ గార్డ్, నేవీ, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్‌ల్లో తీర ప్రాంతాలు, సముద్రాల్లో మానవ ప్రాణాల్లో కాపాడటంపై శిక్షణ ఇచ్చారు. సహాయక చర్యలు కాకుండా, తీరప్రాంత పోలీసులకు కేరళ తీరాన్ని పరిరక్షించే అదనపు బాధ్యతలను కూడా వీరికి అప్పగించారు. ఇంకా సముద్రంలో పడవలు అనుమానస్పదంగా కదిలితే తీర ప్రాంత రక్షకులు గమనించాల్సి వుంటుంది.