శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (13:24 IST)

ఇద్దరి ప్రాణాల కోసం రైలును కిలోమీటరు నడిపిన డ్రైవర్

కొందరు డ్రైవర్ల సమయస్ఫూర్తి పలువురి ప్రాణాలను కాపాడుతుంది. ఆత్మహత్యలు చేసుకోవాలని పట్టాలపై పడుకునేవారు, ప్రమాదవశాత్తు వేగంగా వెళ్లే రైలు నుంచి జారి కిందపడేవారి ప్రాణాలను పలువురు డ్రైవర్లు కాపాడిన ఘటనలు ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 
 
రైలు నుంచి కిందపడిన అన్నాదమ్ములను కాపాడేందుకు ఓ రైలు డ్రైవర్ కిలోమీటరు దూరానికి రైలును వెనక్కి నడిపాడు. ఆ తర్వాత గాయపడిన ప్రయాణికులను ఆంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించేలా సహకరించాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈనెల 26వ తేదీన శుక్రవారం రాజస్థాన్ రాష్ట్రంలో అట్రూ - సల్పూరా ప్రాంతాల మధ్య ఓ రైలు వెళుతోంది. ఈ రైలులో ప్రయాణిస్తున్న మతిస్థిమితం లేని రాజేంద్ర వర్మ (32) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారికిందపడ్డాడు. అతన్ని రక్షించేందుకు సోదరుడు వినోద్ వర్మ రైలు నుంచి దూకేశాడు. దీంతో సహ ప్రయాణికులు చైను లాగి రైలు ఆపారు. ఆ తర్వాత రైలు నుంచి కిందపడి, గాయాలపాలైన అన్నాదమ్ములను రక్షించారు. 
 
అయితే, తీవ్రంగా గాయపడిన వారిద్దరిని ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం లేదు. దీంతో రైలును ఒక కిలోమీటరు దూరం డ్రైవర్ వెనక్కి నడిపి ఆ ఇద్దరు ప్రయాణికులను ఆంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించాడు. ఇలా ఆ డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి తనలోని పెద్ద మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు.