1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (15:52 IST)

మాజీ ముఖ్యమంత్రి మనవరాలు ఆత్మహత్య

కర్నాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్డియూరప్ప మనవరాలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈమె పేరు సౌందర్య నీరజ్ (30). యడ్డియూరప్ప పెద్ద కుమార్తె పద్మ కూతురు. బెంగుళూరులోని వసంత్ నగర్‌లో ఉన్న ఓ అపార్టుమెంటులో ఆమె నివసిస్తున్న ఇంటిలోనే ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈమె బెంగుళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. 
 
గత 2019లో డాక్టర్ సౌందర్యకు వివాహం జరిగింది. ఈమెకు ఓ పాప కూడా ఉన్నారు. అయితే ఆమె ఇంట్లో పని చేసే పని మనిషి శుక్రవారం ఉదయం 10 గంటలకు సౌందర్య ఇంటికి వెళ్లి తలుపు తట్టగా ఎంత సేపటికీ ఆమె తలుపు తీయలేదు. దీంతో సౌందర్ భర్త నీరజ్‌కు ఫోన్ చేసి సమాచారం చేరవేసింది. 
 
ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకుని తలుపులు తెరిచి లోపలకు వెళ్లగా సౌందర్య ఇంట్లోని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు... ప్రాథమిక ఆధారాల మేరకు ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు సమాచారం.