1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మే 2021 (12:11 IST)

కరోనాతో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ కన్నుమూత

కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది రాజీకయ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనా వైరస్ సోకి గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. 
 
హర్యానా, బీహార్‌కు గవర్నర్‌గానూ పనిచేసిన పహాడియా 1980-81 మధ్య రాజస్థాన్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. పహాడియా మరణవార్త విని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 
 
పహాడియా కరోనాతో కన్నుమూశారని, ఆయన మరణవార్త తనను షాక్‌కు గురిచేసిందని గెహ్లాట్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి ఆయనతో తనకు చక్కని అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. పహాడియా మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్నారు.
 
ఇక ఆయన మృతికి సంతాపంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాపదినంగా ప్రకటించింది. నేడు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ పతాకాన్ని అవనతం చేస్తున్నట్టు పేర్కొంది. పహాడియా మృతికి సంతాపం తెలిపేందుకు నేటి మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది.