శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (13:17 IST)

ఎన్సీపీ చీఫ్ నివాసంలో కరోనా కలకలం .. ముంబైను క్రాస్ చేసిన పూణె

మహారాష్ట్రకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నివాసంలో కరోనా కలకలం సృష్టించింది. ఆయన ఇంట్లో ఏకంగా నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. అయితే, అదృష్టవశాత్తు శరద్ పవార్‌కు మాత్రం నెగెటివ్ వచ్చిందని తెలిపారు. 
 
ఎన్సీపీ చీఫ్ నివాసంలో పని చేసే వంట మ‌నిషి, ఇద్ద‌రు సెక్యూరిటీ సిబ్బందితో పాటు మ‌రొక‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ క్ర‌మంలో శ‌ర‌ద్ ప‌వార్ ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్ప‌త్రిలో ఆదివారం ప‌రీక్ష‌లు చేయించుకోగా ఫ‌లితం నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు మంత్రి తెలిపారు. కొద్ది రోజుల వ‌ర‌కు ఆయ‌న ప‌లు కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉండ‌నున్నారు. 
 
ఇదిలావుండగా, దేశంలో క‌రోనా వైర‌స్ హాట్‌స్పాట్ కేంద్రంగా ముంబై న‌గ‌రం ఉండేది. కానీ, ఇప్పుడు క‌రోనా హాట్‌స్పాట్‌గా పుణె మారింది. గ‌త రెండు మూడు రోజుల నుంచి పుణె జిల్లాలో క‌రోనా కేసులు అధికంగా న‌మోదు అవుతున్నాయి. 
 
పుణె జిల్లాలో 1,30,606 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ముంబైలో 1,28,726 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మ‌హారాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 5,95,865కు చేరింది. మ‌ర‌ణాల సంఖ్య 20,037కు చేరిన‌ట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్ల‌డించారు.