గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (17:16 IST)

వరుడుకావాలని ప్రకటన ఇస్తే... మహిళా డాక్టర్‌ను రేప్ చేసి వెళ్లాడు...

వరుడు కావాలని ప్రకటన ఇస్తే ఓ వ్యక్తి యువతిని చూసేందుకు వచ్చిన ఆమెపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేనా ఆమె నుంచి లక్షలాది రూపాయలను గుంజుకుని పారిపోయాడు. ఈ ఘటన బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని దేవనగెరెకు చెందిన ఓ మహిళ డాక్టర్ బెంగుళూరులో నివశిస్తోంది. ఈమె ఇటీవల వరుడు కావాలంటూ పత్రికల్లో ఓ ప్రకటన ఇచ్చింది. దీన్ని చూసిన రామ్మూర్తి అనే వరుడు ఆమెను ఫోనులో సంప్రదించాడు. ఆ తర్వాత వారిద్దరూ పలుమార్లు ఫోనులో మాట్లాడుకున్నారు. ఎస్ఎంఎస్‌ల రూపంలో సందేశాలు పంపించుకున్నారు. 
 
ఆ తర్వాత గత సెప్టెంబరు 30వ తేదీన మహిళా డాక్టర్‌ను రామ్మూర్తి కలిశాడు. అపుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్టు తననుతాను పరిచయం చేసుకున్నాడు. ఆ శాఖలో ఉద్యోగాలు ఇప్పించే రిక్రూట్మెంట్ విభాగంలో ఓ సభ్యుడుగా ఉంటున్నట్టు నమ్మపలికాడు. అలాగే, స్నేహితులు, బంధువులు ఎవరైనా ఉంటే చెప్పండి... ఉద్యోగాలు ఇప్పిస్తాను అని నమ్మించాడు. దీంతో ఆమె తనవారిని పరిచయం చేసింది. వారిని కూడా బురిడీ కొట్టించి వారి నుంచి ఉద్యోగాల కోసం రూ.22 లక్షలు… డాక్టర్ దగ్గర నుంచి రూ.4 లక్షలు మొత్తం రూ.26 లక్షలను రామ్మూర్తి వసూలు చేశాడు. 
 
దీంతో రామ్మూర్తిని పెళ్లి చేసుకోవాలని మహిళా డాక్టర్ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పసిగట్టిన కేటుగాటు... పెళ్లి కోసమని ఆమె ఆధార్ కార్డుతో పాటు కీలక పత్రాలను తీసుకుని, నవంబరు 22వ తేదీన పెళ్లి అని చెప్పాడు. ఇందుకోసం శేషాద్రిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి ఏర్పాట్లు కూడా చేశాడు. అప్పటికే కలిసి అడుగులు వేద్దామంటూ మాటలతో నమ్మించి.. మూడుసార్లు వేర్వేరు హోటళ్లలో ఆమెను వ్యక్తిగతంగా కలిశాడు. పెళ్లి తేదీకి మరో మూడు రోజులు ఉందనగా.. చివరిసారి నవంబరు 20వ తేదీన ఓ హోటల్‌లో ఆమెను కలిశాడు. అంతే ఆ తర్వాత నుంచి అతడి నుంచి నో రెస్పాన్స్. ఫోన్ స్విచ్చాఫ్.
 
ఎంతకీ రాకపోవడంతో అసలు విషయం తెలుసుకున్న మహిళా డాక్టరు తనపై అత్యాచారం జరిగిందని.. డబ్బులు తీసుకుని మోసం చేసి పారిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మోసగాడు రామ్మూర్తి కోసం గాలిస్తున్నారు.