శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 14 జనవరి 2020 (07:32 IST)

నా 20 కోట్లు నాకివ్వండి: సుప్రీంలో కార్తీ చిదంబరం పిటిషన్

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం గతంలో తాను సుప్రీం కోర్టులో డిపాజిట్ చేసిన రూ.20 కోట్లను తిరిగి ఇవ్వాలంటూ సోమవారం పిటిషన్ వేశారు.

తన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి ఇచ్చేందుకు షరతుల్లో భాగంగా కట్టిన ఆ సొమ్మును రిటర్న్ చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ధర్మాసనం.. దీనిపై స్పందన చెప్పాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి  నోటీసు పంపింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
 
యూపీఏ హయాంలో చిదంబరం కేంద్రమంత్రిగా ఉండగా ఆయన సాయంతో కార్తీ అక్రమంగా విదేశాల నుంచి ఐఎన్‌ఎక్స్ మీడియా సంస్థకు రూ.305 కోట్ల నిధులు రప్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కార్తీపై అభియోగాలు నమోదు చేసి.. సీబీఐ, ఈడీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

ఈ కేసులో అరెస్టయిన ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ దేశం దాటి వెళ్లకూడదని షరతు విధించింది. దీంతో గత ఏడాది జనవరి, మే నెలల్లో విదేశీ పర్యటనలకు వెళ్లాలంటూ ఆయన సుప్రీం పర్మిషన్ కోరారు. దీనికి అనుమతిస్తూ కొన్ని షరతలు పెట్టింది న్యాయస్థానం.

ఇందులో భాగంగా రూ.10 కోట్ల చొప్పున రెండు పర్యటనలకు రూ.20 కోట్లు సుప్రీం సెక్రెటరీ జనరల్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఆ మొత్తాన్ని కట్టి విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చిన ఆయన దాన్ని రిటర్న్ చేయాలని కోర్టును కోరుతున్నారు.

రూ.10 కోట్లు లోన్‌గా తీసుకుని కట్టానని, దాని వడ్డీ కడుతున్నానని, ఆ సొమ్ము తిరిగి ఇచ్చేయాలని గత ఏడాదిలో పిటిషన్ వేయగా.. దాన్ని సుప్రీం కోర్టు కొట్టేసింది.