1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 జూన్ 2023 (09:34 IST)

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఢీకొన్న గూడ్సు రైళ్లు... పట్టాలు తప్పిన 12 వ్యాగన్లు

goods train accident
ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఒరిశా రాష్ట్రంలోని బహనగ బజార్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గూడ్సు రైలును ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 292 మంది చనిపోయారు. అప్పటి నుంచి దేశంలో ఎక్కడో చోట రైలు ప్రమాదం జరుగుతూనే వుంది. 
 
తాజాగా పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. అడ్రా డివిజన్‌ పరిధిలోని ఓండా స్టేషన్‌కు సమీపంలో రెండు గూడ్స్‌ రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనతో 12కిపైగా వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రతకు ఓ గూడ్స్‌ రైలు ఇంజిన్‌.. మరో వ్యాగన్‌‌పైకి చేరింది. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగింది. రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదం కారణంగా 14 రైళ్లను ఆదివారం రద్దు చేసినట్లు సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే ప్రకటించింది. మరికొన్నింటిని తాత్కాలికంగా రద్దు చేశామని.. కొన్ని రైళ్లను దారి మళ్లించామని తెలిపింది. ఈ మేరకు ఆ వివరాలను ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.