శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (10:18 IST)

దేశవ్యాప్తంగా గూడ్స్ రైళ్లు పరుగులు

లాక్‌ డౌన్‌ కారణంగా రవాణా స్తంభించింది. దీంతో ఆహార నిల్వల కొరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిని ముందుగానే పసిగట్టిన కేంద్రం మేల్కొంది. రైల్వే ద్వారా దీనిని ఎదుర్కోవాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా గూడ్స్ రైళ్లను పరుగులు పెట్టిస్తోంది. దేశమంతటా అత్యవసరాలను రవాణా చేసేందుకు రైల్వే శాఖ టైమ్‌ టేబుల్‌ పార్సిల్‌ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.

లాక్‌ డౌన్‌ ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 58 రూట్లలో 109 రైళ్లను ప్రకటించినట్లు చెప్పింది. ఏప్రిల్‌ 5 వరకూ 27 రూట్లు నోటిఫై చేయగా, అందులో 17 రూట్లు ఇప్పటికే సర్వీసులు నడుస్తున్నాయి. మిగిలిన రూట్లలో సింగిల్‌ ట్రిప్‌లు మాత్రమే జరుగుతున్నాయి.

ప్రస్తుతం మరో 40 రూట్లను వీటికి జత చేయనున్నట్లు ప్రకటించారు. దీనివల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు రవాణా జరుగుతుందని అధికారులు తెలిపారు.

ప్రత్యేకించి నిత్యావసరాలు, అత్యవసర పరిశ్రమలకు సంబంధించిన సరుకు, వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయవచ్చని తెలిపింది.