1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (12:37 IST)

బోరులోపడిన చిన్నారి.. రక్షించి ఆస్పత్రికి తీసుకెళుతుండగా...

borewell
గుజరాత్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. బోరు బావిలోపడిన ఓ చిన్నారిని రక్షించి ఆస్పత్రికి తరలిస్తుండగా, ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ఎనిమిది గంటల పాటు పోరాడారు. చివరకు ఆ చిన్నారిని ప్రాణాలతో వెలికి తీశారు. కానీ, ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. అంటే చిన్నారిని రక్షించిన కేవలం గంట లోపే చనిపోయింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా జిల్లా ఖంభాలియా పట్టణంలో జరిగింది. 
 
బోరు బావి నుంచి రక్షించిన చిన్నారు సోమవారం రాత్రి 10 నుంచి 10.15 గంటల మధ్య చనిపోయివుంటుందని ఆస్పత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కేతన్ భారతీ వెల్లడించారు. పసిబిడ్డను బోర్ బావి నుంచి బయటకు తీసిన వెంటనే చికిత్స అందించారు. అయితే, అస్పిక్సియా కారణంగానే పాప మరణించిందని తెలిపారు. అంటే ఊపిరి ఆడక అపస్మారకస్థితిలోకి జారుకుందని, ఆ తర్వాత అపస్మారకస్థితిలోనే ప్రాణాలు విడిచివుంటుందని తెలిపారు. ఎక్కువ సేపు బోరుబావిలో ఉండటం వల్ల అవసరమైన మేరకు ఆక్సిజన్ అందక ఈ విషాదానికి కారణమని కేతన్ భారతీ వెల్లడించారు. 
 
కాగా, జిల్లాలోని రాన్ గ్రామానికి చెందిన ఈ చిన్నారి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తన ఇంటి ముందు ఆడుకుంటుండగా బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ సమాచారం అధికారులకు తెలిపిన వెంటనే జాతీయ విపత్తు ప్రతిస్పందన సిబ్బంది సహాయక చర్చల్లో పాల్గొన్నారు. ఈ ఆపరేషన్‌లో ద్వారకా జిల్లా కలెక్టర్ అశోక్ శర్మ సహా సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు పాపను శ్రమించి బయటకు తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.