1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2020 (12:26 IST)

హత్రాస్ బాధితురాలిని ఆమె తల్లి.. సోదరుడే చంపేశారట... నిందితుల లేఖ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన దళిత యువతి హత్యాచార కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులు యూపీ పోలీసులకు ఓ లేఖ రాశాడు. హత్రాస్ బాధితురాలిని ఆమె తల్లి, సోదరుడే చంపేశాడంటూ పేర్కొన్నారు. 
 
పైగా, ఈ కేసులో తామంతా నిరపరాధులమని, కావాలనే ఈ కేసులో ఇరికించారని అతను ఆరోపించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్న సందీప్, రాము, లవ్ కుష్, రవి యూపీ పోలీసులకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో వారు సంచలన ఆరోపణలు చేశారు.
 
ప్రధాన నిందితుడైన సందీప్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, ఆ యువతిపై తాను లైంగిక దాడి చేయలేదని పేర్కొన్నాడు. బాధితురాలు తనకు ముందుగానే తెలుసన్నారు. ఆమె మరణానికి తల్లి, సోదరుడు కారణమని, తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించాడు. 
 
ఆమె సోదరుడు తనకు స్నేహితుడేనని, వారిద్దరూ తరచూ కలుస్తూ, ఫోనులో మాట్లాడుకుంటూ ఉంటారని కూడా తెలుస్తోంది. సందీప్ కోసం ఓ ఫోన్ నంబరును బాధితురాలి సోదరుడు తన పేరు మీద రిజిస్టర్ చేసి, కొని ఇచ్చాడని కూడా తెలుస్తోంది. 
 
కాగా, ఈ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉండటంతో కేసు విచారణను మరింత లోతుగా జరపాలని అధికారులు నిర్ణయించారు. నిందితులకు అండగా క్షత్రియ సమాజం నిలిచిందన్న సంగతి తెలిసిందే. వారంతా అమాయకులని ఓ వర్గం వాదిస్తోంది. 
 
బాధితురాలి మృతి తర్వాత తొలుత అత్యాచారం జరగలేదని రిపోర్టు రావడం, ఆపై జరిగిందని దాన్ని మార్చడం తదితర పరిణామాలు, విచారణను జఠిలం చేయనున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు.