శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (16:57 IST)

రాహుల్‌కు లాఠీ దెబ్బ.. కిందపడిన నేతను పైకి లేపిన కార్యకర్తలు

కాంగ్రెస్ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ పోలీసులు లాఠీ దెబ్బ రుచిచూపించారు. హత్రాస్ జిల్లాలో అత్యాచారనికి గురై చనిపోయిన యువతి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరిన రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. వారి కాన్వాయ్‌ను నిలిపివేశారు. దీంతో వారు కాలి నడకన బాధితురాలి ఇంటికి యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై బయలుదేరారు. అయితే, కొంతదూరం వెళ్లనిచ్చాక.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
 
హత్రాస్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడికి వెళ్లడం మానుకోవాలని పోలీసులు రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఆయన ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. 
 
కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు తమ లాఠీలకు స్వల్పంగా పని చెప్పాల్సివచ్చింది. ఈ క్రమంలో జరిగిన పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు.
 
ఆ తర్వాత సహచర నేతలు, కార్యకర్తలు కలిసి ఆయన్ను పైకిలేపారు. పోలీసుల లాఠీ దెబ్బతో పాటు.. కిందపడటతో రాహుల్ గాంధీకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన సోదరి ప్రియాంకా గాంధీ రాహుల్‌ను పరామర్శించింది.