Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు: బీఎస్ఎఫ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని (పీఓకే) తమ శిక్షణ శిబిరాలు, స్థావరాలకు ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో తిరిగి చేరుకుంటున్నారని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత బీఎస్ఎఫ్ శిక్షణా శిబిరాలను, స్థావరాలను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తున్నారని బీఎస్ఎఫ్ వెల్లడించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో నియంత్రణ రేఖ (ఎల్డీసీ), అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగే ప్రమాదం ఉందని, భద్రతా సంస్థలన్నీ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ విషయమై మీడియా సమావేశంలో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) శశాంక్ ఆనంద్ మాట్లాడుతూ, "కాశ్మీర్, జమ్మూ ప్రాంతాల్లోని నియంత్రణ రేఖతో పాటు, జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద కూడా వివిధ రకాల నిఘా సమాచారం నిరంతరం అందుతూనే ఉంది. ఇటీవలి కాలంలో ఇది మరింత స్పష్టంగా గమనిస్తున్నాం" అని తెలిపారు.
ఉగ్రవాదులు ఎప్పుడు, ఎక్కడ చొరబాటుకు ప్రయత్నిస్తారనే దానిపై ప్రస్తుతం కచ్చితమైన సమాచారం లేనప్పటికీ, ఉగ్రవాద సంస్థలు చొరబాట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని నిరంతరాయంగా నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోందని శశాంక్ వివరించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు తమ శిబిరాలకు తిరిగి చేరుకుంటున్నారు.
కొత్తవారికి శిక్షణ ఇస్తున్నారు. భద్రత తక్కువగా ఉందని భావించిన చోటల్లా చొరబడేందుకు ప్రయత్నిస్తారు. నియంత్రణ రేఖ అయినా, అంతర్జాతీయ సరిహద్దు అయినా, అన్ని ప్రాంతాల్లో మన భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుందని శశాంక్ తెలిపారు.