1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:59 IST)

మోదీ తాతా.. నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు..?.. అడిగింది ఎవరు..?

PM Modi
పదేళ్ల చిన్నారికి ప్రధాని మోదీని కలవాలనిపించింది. మెయిల్‌ చేస్తే రమ్మని పిలుపు వచ్చింది. ఇంకేం ఎంతో ఉత్సాహంతో తల్లిదండ్రులను వెంటేసుకుని పార్లమెంట్‌కు చేరుకుంది. ప్రధానిని కలిసిన ఆ చిన్నారి ఎన్నో ప్రశ్నలు అడిగింది. అన్నింటికీ మోదీ సావధానంగా జవాబులు చెప్పారు.
 
చిన్నారికి ఎన్నో చాక్లెట్లు ఇచ్చారు. చివరకు మోదీ తాతా.. నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు..? అని ప్రశ్నించి నరేంద్ర మోదీని పగలబడి నవ్వేలా చేసింది. ఏం సమాధానం చెప్పాలో తెలియని మోదీ.. కాస్సేపు అలాగే నవ్వుతూ ఉండిపోయారు.  
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ సుజయ్‌ విఖే పాటిల్‌ బీజేపీ ఎంపీ. ఆయన తండ్రి రాధాకృష్ణ విఖే పాటిల్‌ కూడా అప్పట్లో మంత్రిగా పనిచేసి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేరారు. అయితే, సుజయ్‌ పాటిల్‌ కుమార్తె 10 ఏండ్ల అనీష పాటిల్‌ గత కొన్నాళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవాలని అనుకుంది. 
 
తండ్రికి చెబితే మోదీ చాలా బిజీగా ఉంటారని, అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేరని నచ్చజెప్పారు. దాంతో తానే మోదీ మెయిల్‌కు లేఖ రాసింది. 'నేను మిమ్మల్ని నిజంగా కలవాలనుకుంటున్నాను' అని సింపుల్‌గా లేఖలో తెలిపింది. ఇది చూసిన మోదీ తనను కలిసేందుకు ఆమెను ఆహ్వానించారు.
 
పార్లమెంట్‌ వద్ద సుజయ్‌ పాటిల్‌ కనిపించగానే.. ఎక్కడ అనీషా అంటూ ఆరా తీశాడు. అక్కడే ఉన్న అనీషాకు షేక్‌హ్యాండిచ్చి.. పక్కనే ఉన్న తన చాంబర్‌లోకి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి చాక్లెట్లు ఇచ్చారు. ఆ పాప అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చారు. వీరి సంభాషణ 10 నిమిషాల పాటు కొనసాగింది.