శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (12:57 IST)

తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు సై : సీసీఎస్

భారత వాయుసేన అవసరాలను తీర్చేందుకు భారీ స్థాయిలో యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన సీసీఎస్ (క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం 73 తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, మరో 10 శిక్షణ విమానాలను కొనుగోలు చేయనున్నారు. ఈ విమానాల కొనుగోలుకు రూ.45,696 కోట్లను వ్యయం చేయనున్నారు. 
 
తేజస్ యుద్ధ విమానాలు పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయన్నారు. ఎంకే-1ఏ లైట్ కాంబాయ్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు నాలుగో తరానికి చెందినవి. వీటిల్లో ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సూట్, గాల్లోనే ఇంధనం నింపుకునే సదుపాయంతో పాటు ఏఈఎస్ఏ సదుపాయాలుంటాయి. భారత వాయుసేనకు ఇవి వెన్నెముకగా నిలుస్తాయని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. 
 
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే తేజస్ విమానాలు దేశ రక్షణకు ఎంతో ఉపకరిస్తాయని, వీటిల్లో ఇంతవరకూ వాడని టెక్నాలజీని వాడారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు.
 
నూతన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంతో భారత వాయుసేన మరింత బలోపేతమైందని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. ఈ డీల్ కారణంగా మరిన్ని కొత్త ఉద్యోగాలు సైతం లభించనున్నాయని అన్నారు. 
 
ఇదిలావుండగా, సీసీఎస్ కమిటీ సమావేశంలో ఈ యుద్ధ విమానాల నిర్వహణ, మరమ్మతులకు పలు ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది.