శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (20:54 IST)

పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం సక్సెస్ - సంబరాల్లో ఇస్రో శాస్త్రవేత్తలు

pslv testfire
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. గురువారం సాయంత్రం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ సెంటరు నుంచి పీఎస్ఎల్వీ సీ-53ని విజయవంతంగా ప్రయోగించింది. గురువారం సాయంత్రం 6.02 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ శాటిలైట్ అన్ని దశలను సజావుగా పూర్తిచేసింది. 
 
ఈ ప్రయోగంతో సింగపూర్‌కు చెందిన డీఎస్-ఈవో ఉపగ్రహంతో పాటు న్యూసార్, స్కూప్-1 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ మూడింటిలో డిస్-ఈవో బరువు 365 కేజీలు కాగా, అతి చిన్నదైన స్కూబ్-1 బరువు 2.8 కేజీలు మాత్రమే. తాజా ప్రయోగంతో సంతృప్తికరంగా ముగియడంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంతోషం వెల్లివిరిసింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. 
 
కాగా, వాణిజ్య ప్రాతిపదికన ఇతర దేశాలకు చెందిన శాటిలైట్లను కూడా ఇస్రో రోదసీలోకి పంపుతున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2016లో పీఎస్ఎల్వీ సి37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లి చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. 
 
ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే చాలా తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలను ఇస్రో చేపడుతుంది. దీంతో అనేక దేశాలు భారత్ వైపు మొగ్గు చూపుతూ తమ శాటిలైట్లను ఇస్రో ద్వారా రోదసీలోకి పంపించేందుకు దోహదపడుతున్నాయి.