ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 మే 2022 (14:01 IST)

శుక్ర గ్రహ ప్రయోగానికి ఇస్రో సన్నద్ధం: ఛైర్మన్ సోమనాథ్

Venus
Venus
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్ర గ్రహ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. అతి త్వరలోనే శుక్ర గ్రహం ప్రయోగం చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పష్టం చేశారు. ఆ ప్రయోగానికి సంబంధించిన సత్తా, సామర్థ్యం భారత్‌కు ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించిన ప్లాన్‌నూ ఇప్పటికే సిద్ధం చేసి పెట్టామన్నారు. 
 
ఎన్నో ఏళ్ల నుంచి వీనస్ మిషన్‌పై పనిచేస్తున్నామని, ఇప్పుడు ప్రణాళిక తయారైందని సోమనాథ్ వివరించారు. ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సిద్ధం చేశామని, వీనస్‌లో దాగి ఉన్న రహస్యాలను వెలికి తీసే ఈ ప్రాజెక్టుకు నిధులు కూడా సమకూరాయని చెప్పారు. అతి త్వరలోనే ప్రయోగాన్ని చేపడతామని సోమనాథ్ వెల్లడించారు.  
 
ఇకపోతే.. అంతరిక్ష మండలంలోనే అత్యంత వేడి గ్రహం శుక్రుడు (వీనస్). మన భూమికి కవల గ్రహం, పొరుగు గ్రహం అనీ దానిని పిలుస్తుంటారు. దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలతో అత్యంత విషపూరితమైన గ్రహంగానూ దానికి పేరుంది. 
 
మంగళ్ యాన్ వంటి ప్రతిష్ఠాత్మక అంగారక ప్రయోగాన్ని భారత్ అతి తక్కువ ఖర్చుతోనే చేయగలగడం, ఇటు చంద్రయాన్ 2ని కూడా ఎవరూ ఊహించని రీతిలో అతి తక్కువ నిధులను వాడుకుని స్లింగ్ షాట్ టెక్నిక్‌లో చేపట్టడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 
 
ఈ క్రమంలోనే భారత్ వీనస్ పైనా ఫోకస్ పెట్టింది. ఆర్బిటర్‌ను పంపి అక్కడి వీనస్ ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయించింది. 
 
వీనస్‌పై మన దేశం ఒక్కటే కాదు.. అమెరికా వంటి అగ్రరాజ్యాలూ ప్రత్యేక దృష్టిని సారించాయి. ఉన్నట్టుండి అది నిప్పుల గోళంగా ఎలా మారిందనే విషయాన్ని తెలుసుకునేందుకు ఉబలాటపడుతున్నాయి. 
 
శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కూడా ఓ స్పేస్ క్రాఫ్ట్‌ను పంపనుంది. అందుకోసం 100 కోట్ల డాలర్లను ప్రస్తుతానికి కేటాయించింది.