1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (10:06 IST)

లిక్కర్ కేసు నిందితుడి తితిదే పాలక మండలిలో చోటు... సీఎం జగన్ సర్కారు జీవో

sarath chandra reddy
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి అప్రూవర్‌గా మారిన అరబిందో గ్రూపు డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి తిరుమల తిరుపతి బోర్డు పాలక మండలిలో సభ్యత్వం కల్పించారు. ఇప్పటికే తితిదే ఛైర్మెన్‌గా క్రైస్తవమతానికి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇవేమీ పట్టించుకోకుండా తాజాగా తితిదే పాలక మండలిలో లిక్కర్ స్కామ్ నిందితుడైన శరత్ చంద్రారెడ్డికి చోటుకల్పించారు. 
 
అలాగే, మంత్రిపదవులు, ఎమ్మెల్యే టిక్కెట్లను కేటాయించలేని రాజకీయ నేతలకు తితిదే పాలక మండలి ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది. దీన్ని రుజువు చేసేలా సీఎం జగన్ పలువురు నేతలకు తితిదే సభ్యుడిగా సభ్యత్వం కల్పించారు. వైకాపా ప్రభుత్వంలో అన్ని పదవుల్లోనూ అగ్రప్రాధాన్యమిస్తున్న ప్రధాన సామాజికవర్గానికే బోర్డులో సుమారు అయిదో వంతు పదవులు కట్టబెట్టింది. 
 
బెంగళూరులో సీఎం జగన్ ఇల్లున్న యలహంక ప్రాంత ఎమ్మెల్యేను సభ్యుడిగా మరోమారు కొనసాగించింది. తితిదే సభ్యులుగా మొత్తం 24 మందిని నియమించాలంటూ ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం సిఫార్సు చేసినట్లుగా శుక్రవారం రాత్రి జాబితా బయటికొచ్చింది. అర్థరాత్రి దాటాక అదే పేర్లతో ఉత్తర్వులు వెలువడ్డాయి.
 
తితిదే అంటే పవిత్రతకు మారుపేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా లిక్కర్ కేసులో అరెస్టయి, అప్రూవర్‌గా మారిన పెనక శరత్ చంద్రారెడ్డికి వైకాపా ప్రభుత్వం చోటుకల్పించింది. దీనికి కారణం... వైకాపాలో దాదాపు నంబర్ 2గా, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా చక్రం తిప్పుతున్న విజయసాయి రెడ్డి అల్లుడి అన్నే ఈ శరత్ చంద్రారెడ్డి కావడం గమనార్హం. 
 
వైకాపా అధికారంలోకి రాగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా శరత్ చంద్రారెడ్డి చేతుల్లోకి వచ్చిందంటే అది సాయిరెడ్డి ప్రభావమే. శరత్ చంద్రారెడ్డి వ్యాపార సంస్థ అరబిందోకు రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు దక్కాయి. తితిదే ఛైర్మన్, ఈవో సహా తిరుమల - తిరుపతిల్లోని కీలక పదవులను ఒక ప్రధాన సామాజికవర్గానికి ప్రభుత్వం కట్టబెట్టింది. తాజాగా తితిదే పాలకమండలిలోని 24 మంది సభ్యుల్లో అయిదుగురు ఆ సామాజికవర్గంవారే కావడం గమనార్హం.