1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (08:43 IST)

ధన్‌బాద్ జడ్జి హత్య కేసు విచారణ సీబీఐకు అప్పగింత

జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో జరిగిన అడిషనల్ న్యాయమూర్తి హత్య కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్నింగ్‌ జాగింగ్‌కు వెళ్లిన జడ్జీని మైనింగ్ మాఫియా ఆటోతో ఢీకొట్టించి హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ మృతి తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. కానీ, సీసీ టీవీ కెమరాల నుంచి దుండగులు తప్పించుకోలేక పోయారు.
 
ఈ హత్యపై జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరారు. అలాగే, కేసు దర్యాప్తు కోసం జార్ఖండ్‌ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేసింది. 
 
ధన్‌బాద్‌ అదనపు సెషన్స్‌ కోర్టు జడ్జిగా పని చేస్తున్న ఉత్తమ్‌ ఆనంద్‌ గత నెల 28న ఉదయం రోడ్డు పక్కన జాగింగ్‌ చేస్తున్న జడ్జిని ఓ ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపుమడుగులో ఉన్న ఆయనను ఓ వ్యక్తి గమనించి దవాఖానకు తరలించగా మృతి చెందారు.
 
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఆటో ఉద్దేశపూర్వకంగానే జడ్జిని ఢీకొట్టినట్లు తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో.. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో తమప్రేమం ఉందని నిందితులు సైతం ఒప్పుకున్నారని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అమోల్‌ వినుకాంత్‌ హోంకార్‌ తెలిపారు. 
 
ఆటోను దొంగతనం చేశారని పేర్కొన్నారు. పట్టణంలో అనేక మాఫియా హత్యకేసులను న్యాయమూర్తి విచారిస్తున్నారు. ఇటీవల ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల బెయిల్‌ అభ్యర్థనలను తిరస్కరించారు. దీంతో ఆగ్రహించిన గ్యాంగ్ మాఫియా ఈ దారుణానికి పాల్పడివుంటుందని భావిస్తున్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు కూడా కేసును సుమోటాగా స్వీకరించి విచారణ జరుపుతుంది.