శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (09:54 IST)

మీ దైన్యస్థితి ఏంటో దేశానికి తెలుసు : జగన్‌కు జేఎంఎం కౌంటర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా చేసిన ట్వీట్​కు ఝార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్ స్నేహం చేస్తున్నట్లు జేఎంఎం ఆరోపించింది. ప్రధాని మోడీపై ఝార్ఖండ్ సీఎం చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్ ఖండించిన నేపథ్యంలో ఆయన ట్వీట్‌కు ఝార్ఖండ్ ముక్తి మోర్చా కౌంటర్ ఇచ్చింది. 
 
కేంద్రం వైఖరితో చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నా.. ఏపీ సీఎం జగన్ మాత్రం సొంత ఆసక్తితో భాజపాకు మద్దతు తెలుపుతున్నారని ఆక్షేపించింది. ఏపీ సీఎం జగన్ కన్నా.. ఝార్ఖండ్ సీఎం ఎంతో పరిణతి కలవారని.. జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య అన్నారు. 
 
అంతకుముందు... 'ప్రధాని తన మన్‌కీ బాత్‌తోపాటు... మేం చెప్పింది కూడా వింటే బాగుండేది' అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలను జగన్‌ తప్పుపట్టిన సంగతి తెలిసిందే.
 
'ఇలాంటి రాజకీయాలతో దేశం బలహీనపడుతుంది. కొవిడ్‌పై యుద్ధం చేస్తున్న మోడీని బలోపేతం చేద్దాం' అని జగన్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై... జేఎంఎం శనివారం ట్విట్టర్‌లోనే కౌంటర్‌ ఇచ్చింది.
 
'వైఎస్‌ జగన్‌ జీ! మీ నిస్సహాయత గురించి దేశమంతటికీ తెలుసు.  మేం మీ పట్ల ప్రేమాభిమానాలు చూపుతున్నాం. మీరు ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. కాగా, జగన్ బెయిల్ పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. అందుకే మోడీపై జగన్ భక్తిభావం చూపుతూ ట్వీట్ చేశారన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే.