1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (08:04 IST)

వర్క్ ప్రెజర్ తట్టుకోలేక పనిచేసే చోటే ఉరేసుకున్న బ్యాంకు మేనేజర్

కరోనా వైరస్ మహమ్మారి ప్రతి ఒక్కరిపై అన్ని విధాలుగా తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఈ ఒత్తిడి తీవ్రంగా ఉంది. దీంతో అనేక మంది ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తాను మేనేజర్‌గా పని చేస్తున్న బ్యాంకులో పని ఒత్తిడిని తట్టుకోలేక పోయిన ఓ ఉద్యోగిని, అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదరక ఘటన కేరళలోని కన్నూర్ సమీపంలో గల తొక్కిలంగడిలో తీవ్ర కలకలం రేపింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఇక్కడ ఉన్న బ్యాంకులో స్వప్న (38) అనే మహిళ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత వారాంతంలో ఉదయం 9 గంటలకు మరో బ్యాంకు ఉద్యోగి పని నిమిత్తం వెళ్లగా, స్వప్న ఉరి వేసుకుని కనిపించడంతో అవాక్కై, అలారం మోగించారు. దీంతో స్థానికులు, ఇతర బ్యాంకు సిబ్బంది హుటాహుటిన వచ్చి, ఆమెను ఆసుపత్రికి తరలించినా, లాభం లేకపోయింది.
 
అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుతుంపరంబా ఏసీపీ కేజీ సురేష్ నేతృత్వంలోని పోలీసు బృందం, బ్యాంకుకు చేరుకుని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆపై స్వప్న నిత్యమూ రాసుకునే డైరీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాలూకా ఆసుపత్రికి తరలించారు. 
 
పనిలో పెరిగిపోయిన ఒత్తిడిని తట్టుకోలేకనే ఆమె ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నట్టు డైరీలో రాసుకుందని అన్నారు. కాగా, గత సంవత్సరం ఆమెకు తొక్కిలంగడి శాఖలో పోస్టింగ్ ఇచ్చారు. కన్నూర్‌లో తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆమె నివశిస్తుండగా, తల్లి మృతితో పిల్లలు అనాధలయ్యారు.