శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 మే 2024 (10:32 IST)

ప్రధాని మోడీ హోటల్ బస బిల్లు రూ.80 లక్షలు.. మేమే చెల్లిస్తామంటున్న కర్నాటక సర్కారు!!

narendra modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బస చేసిన హోటల్ బిల్లును తామే చెల్లిస్తామని కర్నాటక రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెబుతుంది. గత యేడాది మైసూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. ఆ సమయంలో ఆయన ఓ హోటల్‌లో బస చేశారు. ఈ వ్యవహారం తాజాగా చర్చనీయాంశమైంది. ఆ రోజు హోటల్ బిల్లు రూ.80 లక్షలు ఇంకా చెల్లించక పోవడమే ఇందుకు కారణం. దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పెండింగులో ఉన్న ఆ బిల్లును కర్ణాటక ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేసింది.
 
'రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయం. కానీ, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 'ప్రాజెక్ట్ టైగర్' కార్యక్రమాన్ని ఎన్టీసీఏ ఏర్పాటు చేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొనలేదు. అయినప్పటికీ ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది' అని రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే వెల్లడించారు. 
 
'ప్రాజెక్టు టైగర్' మొదలై 50 ఏళ్లు పురస్కరించుకొని గతేడాది ఏప్రిల్ నెలలో మైసూరులో ఓ కార్యక్రమం ఏర్పాటుచేశారు. దీనికి దాదాపు రూ. 3కోట్లు ఖర్చు అంచనా వేసినప్పటికీ.. అది రూ.6.33 కోట్లకు చేరుకుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రూ.3 కోట్లు చెల్లించగా.. మిగతావి పెండింగులోనే ఉన్నాయి. 
 
అయితే, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీ.. మైసూరులోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేశారు. ఇప్పటికీ ఆ హోటల్ బిల్లు రూ.80 లక్షలు చెల్లించలేదు. దీంతో వాటిని రాబట్టేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు హోటల్ యాజమాన్యం సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో పడింది.