శనివారం, 2 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2025 (10:57 IST)

ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే రూ.20 : కేరళ సర్కారు నిర్ణయం

liquor brands
మందు బాబులకు కేరళ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. మద్యం తాగిన తర్వాత ఖాళీ బాటిల్‌ను తిరిగి దుకాణంలో ఇస్తే రూ.20 చెల్లిస్తామని వెల్లడించింది. అయితే, ఇక్కడో మెలిక పెట్టింది. ముందుగా ప్రతి మద్యం బాటిల్‌పై రూ.20 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి మద్యం బాటిల్‌పై అదనంగా రూ.20 ముందస్తు డిపాజిట్ చేయించుకొని, ఆ బాటిల్‌ను తిరిగి అదే అవుట్ లెట్‌లు డిపాజిట్ చేస్తే, ఆ సొమ్మును తిరిగి చెల్లిస్తారు. త్వరలో దీనిని అమలు చేయనున్నారు. మద్యం సేవించిన అనంతరం బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పారవేయడం వల్ల తలెత్తుతున్న సమస్యలను నివారించేందుకు కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
 
రాష్ట్రవ్యాప్తంగా బేవరేజస్ కార్పొరేషన్ ద్వారా ఏడాదికి 70 కోట్ల సీసాల మద్యం విక్రయాలు జరుగుతున్నాయని కేరళ ప్రభుత్వం పేర్కొంది. అయితే, మొత్తం అమ్ముడవుతున్న మద్యం బాటిళ్లలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి, మిగిలినవి వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
 
ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేశ్ వెల్లడించారు. సాధ్యమైనంత వరకు గాజు సీసాల్లోనే మద్యం నింపాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాని పక్షంలో రూ.800 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన మద్యాన్ని గాజు సీసాల్లోనే విక్రయించాలని, తక్కువ ధర కలిగిన మద్యాన్ని ప్లాస్టిక్ బాటిళ్లలో నింపవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని సెప్టెంబరులో కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టి, జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.