నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..
మహారాష్ట్రలో ఓ నిత్య పెళ్లి కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. 15 యేళ్లలో ఎనిమిది మందిని పెళ్లాడిన ఆమె... మరో పెళ్లికి సిద్ధమైన సమయంలో పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సమీరా ఫాతిమా అనే ఉపాధ్యాయురాలు అక్రమ మార్గంలో తక్కువ సమయంలో ఎక్కువగా డబ్బు సంపాదించేందుకు ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. వయస్సు మీదపడుతున్నా పెళ్లికాని ధనవంతులను లక్ష్యంగా చేసుకుంది.
సామాజిక మాధ్యమాల ద్వారా వారికి దగ్గరై.. విధిలేని పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, ఓ బిడ్డతో కలిసి ఒంటరిగా ఉంటున్నట్లు చెబుతుంది. చివరికి ముగ్గులో దించి పెళ్లి చేసుకుంటుంది. కొన్ని రోజులు గడిచాక.. పథకం ప్రకారం వారి నుంచి డబ్బు డిమాండ్ చేస్తుంది. అవసరమైతే బెదిరించి బలవంతంగా వసూలు చేసేందుకు ఆమెకు ప్రత్యేక గ్యాంగ్ కూడా ఉంది. ఇలా గత 15 ఏళ్లల్లో 8 పెళ్లిళ్లు చేసుకొని.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బును వసూలు చేసింది.
సమీర తన నుంచి రూ.50 లక్షలు బలవంతంగా వసూలు చేసిందని ఆమె భర్తల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఆమె బాధితుల్లో రిజర్వ్బ్యాంక్ సీనియర్ అధికారులు కూడా ఉండటం గమనార్హం. అయితే, 8 మంది భర్తల నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితురాలు.. మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో జులై 29న నాగ్పుర్లోని ఓ టీ దుకాణం వద్ద ఆ వ్యక్తిని కలిసేందుకు వచ్చిన ఆమెను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.