గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (06:25 IST)

కరోనా టీకాల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత్!

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి చెక్ పెట్టేందుకు అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాల మన దేశంలో ఈ నెల 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా ప్రారభమయ్యాయి. అయితే, ఈ టీకాల పంపిణీలో భారత ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ రికార్డును చూసి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు చిన్నబోయాయి.
 
ఒకే రోజు ఏకంగా 2,07,229 మందికి ఈ టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన తొలిరోజైన జనవరి 16న దేశవ్యాప్తంగా 2,07,229 మందికి వ్యాక్సిన్‌ ఎక్కించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అడిషనల్ సెక్రటరీ మనోహన్ అగ్నాని ప్రకటించారు. ఈ సంఖ్య అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ దేశాల్లో కలిపి ఒకేరోజు వేసిన సంఖ్య కంటే ఇంకా ఎక్కువని వెల్లడించారు.
 
ఇకపోతే, తొలి రోజున 2.7 లక్షల మంది వ్యాక్సిన్‌ తీసుకోగా, రెండో రోజు 17 వేల మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఇప్పటివరకు 2,24,301 మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. టీకా తీసుకున్న వారిలో 447 మందికి చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే, అవి కేవలం సాధారణమైన జ్వరం, తలనొప్పి, అలసట వంటివి మాత్రమేనని చెప్పారు. వీరిలో ముగ్గురికి మాత్రం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిచాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.
 
'వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్యంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 553 కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగింది. రెండో రోజు మొత్తం 17,072 మందికి వ్యాక్సిన్‌ అందించాం. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఆదివారం నాడు టీకా పంపిణీ కొనసాగింది. వ్యాక్సిన్‌ పంపిణీపై అన్ని రాష్ట్రాలతో ఇప్పటికే సమీక్ష జరిపాం' అని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదనపు కార్యదర్శి మనోహర్‌ వెల్లడించారు.