మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 నవంబరు 2023 (12:29 IST)

ప్రమాదంలో గాయపడి రక్తమోడుతున్నా కనికరించని ఢిల్లీ వాసులు...

deadbody
దేశ రాజధాని ఢిల్లీలో సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి జరిగింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడి రోడ్డుపై పడిపోయిన క్షతగాత్రుడు తీవ్రమైన రక్తస్రావంతో బాధపడుతున్నప్పటికీ ఒక్కరంటే ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చివరకు పోలీసులు వచ్చి ఆ క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 
ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే, దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ ఎన్‌క్లేవ్ సమీపంలో పీయూష్ బైక్ (30) అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంతో పీయూష్ అల్లంత దూరం ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదం తర్వాత రోడ్డుపై రక్తపు మడుగులో పడివుంటే చుట్టూ ఉన్న జనం అతడిని ఆసుపత్రికి తరలించడమో, పోలీసులకు సమాచారం అందించడమో చేయకుండా చోద్యం చూస్తూ వీడియోలు తీశారు. 
 
అంతటితో ఆగలేదు. అతడి 'గోప్రో'ను చోరీ చేసి తీసుకెళ్లిపోయారు. సౌత్ ఢిల్లీలో జరిగిందీ ఘటన. బాధితుడిని డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ పీయూష్ పాల్గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్టోబరు 28న రాత్రి 10 గంటల సమయంలో జరిగిందీ ఘటన. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 
 
ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కలవారు స్పందించి ఉంటే ఆయన బతికి ఉండేవాడని పీయూష్ స్నేహితుడు తెలిపారు. రక్తమోడుతూ రోడ్డుపై విలవిల్లాడుతున్న పీయూష్ చుట్టూ మూగిన జనం ఫొటోలు, వీడియోలు తీయడంలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తంచేశాడు. దాదాపు 20 నిమిషాలపాటు పీయూష్ అలాగే రోడ్డుపై పడి ఉన్నాడని, ఆయన శరీరంలోని రక్తం మొత్తం పోయిందని పేర్కొన్నాడు. కాగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వెనక నుంచి వచ్చి పీయూష్‌ను ఢీకొట్టిన బైకర్‌ను బంటీగా గుర్తించి నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.