తమిళనాడులో మద్యం విక్రయాలకు బ్రేక్ పడుతుందా? 20 శాతం పెరిగిన అమ్మకాలు
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్యనిషేధ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. దీంతో ప్రతి రాజకీయ నేత కూడా ఈ అంశాన్నే పదేపదే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నిషేధాలకు బ్రేక్ పడొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా మద్యం అమ్మకాలు 20 శాతం మేరకు పెరిగిపోయాయి.
తమిళనాడు ప్రభుత్వానికి చెందిన స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఎంఏసీ) ఔట్లెట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ కార్పొరేషన్కు సుమారు ఆరు వేల ఔట్లెట్స్ ఉన్నాయి. వీటిన్నింటిలో కలిపి 20 శాతం మేరకు అమ్మకాలు పెరిగాయి.
మే తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం మద్యం విక్రయాలను నిషేధిస్తారోనని మందుబాబులు ఇప్పుడే కొనేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఏప్రిల్ నెలలో మద్యం అమ్మకాలు బాగా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.