శుక్రవారం, 4 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జులై 2025 (12:51 IST)

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

suicide
పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోయారు. తీసుకున్న అప్పు చెల్లించలేని ఓ యువకుడుని తీవ్రంగా హింసించారు. దీంతో ఈ వేధింపులను భరించలేని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పుదుచ్చేరికి చెందిన విక్రమ్ (33) అనే యువకుడు చిన్న వ్యాపారం చేసుకుంటూ ఓ చికెన్ షాపులో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అతడు ఉపాధిని కోల్పోయాడు. ఈ క్రమంలో వ్యాపారం కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేకపోయాడు. 
 
విక్రమ్ తీసుకున్న రుణాల్లో భాగంగా, రూ.3.8 లక్షల అప్పునకు నెలకు రూ.38 వేల వడ్డీ, మరో రూ.30 వేల రుణానికి నెలకు రూ.6 వేలు చొప్పున వడ్డీ కట్టాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. ప్రమాదం తర్వాత విక్రమ్ పని చేయలేని స్థితిలో ఉండటంతో అప్పుల వాళ్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.
 
మృతుడు విక్రమ్ ప్రముఖ నటుడు విజయం స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీలో స్థానికంగా క్రియాశీలక కార్యకర్తగా పని చేస్తున్నాడు. వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో తన చావుకు కారణమైన ఫైనాన్షియర్ల పేర్లను ప్రస్తావించాడు. తన భార్య బాగోగులు చూసుకోవాలని నటుడు విజయ్‌ను వేడుకోవడం అందరినీ కంటతడిపెట్టిస్తోంది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ వడ్డీ వ్యాపారుల ఆగడాలను స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనతో పుదుచ్చేరి, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారాల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. దోషులను కఠినంగా శిక్షించి, బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.