1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మే 2020 (09:00 IST)

మే నెలాఖరు వరకు లాక్డౌన్ పొడగింపు తథ్యం.. కానీ...

కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసి, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు కేంద్రం అమలు చేస్తున్న లాక్డౌన్ (మూడో దశ) 17వ తేదీ ఆదివారంతో ముగియనుంది. అయితే, ఈ లాక్డౌన్‌ను ఈ నెలాఖరువరకు పొడిగేంచుదుకు కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆదివారం సాయంత్రం ఓ అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ నాలుగో దశ లాక్డౌన్‌లో మాత్రం అనేక రకాలైన సడలింపులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
ముఖ్యంగా, నాలుగో దశ లాక్డౌన్‌లో రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి తెరచుకునే అవకాశాలున్నాయని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కొన్ని నిబంధనలను పాటిస్తూ, ప్రజా రవాణాకు కూడా గేట్లు ఎత్తేయవచ్చని సమాచారం. 
 
స్వదేశీ విమాన సర్వీసులకు పలు ఆంక్షల మధ్య అనుమతి ఇవ్వొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా, విమానం బయలుదేరే ప్రాంతం, గమ్యస్థానం ఉన్న ప్రభుత్వాల మధ్య కుదిరే అంగీకారం మేరకే టేకాఫ్‌లు ఉండాలని నిబంధన విధించే అవకాశాలు ఉన్నాయి. 
 
నగరాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున మెట్రో రైల్ సేవలను పునఃప్రారంభించే విషయమై ఇప్పట్లో నిర్ణయించే వీలు కనిపించడం లేదు.రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన సూచనలు, నివేదికల మేరకు ఇప్పటికే హోంశాఖ లాక్డౌన్ 4.0పై విధివిధానాలను సిద్ధం చేసినట్టు సమాచారం. 
 
గ్రీన్, ఆరంజ్ జోన్లలో ఆటో రిక్షాలు, క్యాబ్ సర్వీసులు, ఈ-కామర్స్ సంస్థల ద్వారా అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి అంగీకరించాలని ప్రభుత్వం నిశ్చయించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
 
కాగా, మన దేశంలో మార్చి 25వ తేదీ నుంచి ఈ లాక్డౌన్ అమల్లోకివచ్చింది. ఇందులో తొలి దశ లాక్డౌన్ ఏప్రిల్ 15 వరకు, రెండో దశ లాక్డౌన్ 4వ తేదీ వరకు కొనసాగగా, మూడో దశ లాక్డౌన్ మే 17వ తేదీ వరకు అమలుచేశారు. ఇది ఆదివారంతో ముగియనుండటంతో దీన్ని మరోమారు పొడగించేందుకు సిద్ధమైంది.