గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (11:21 IST)

కులాంతర పెళ్లి చేసుకుందనీ... గర్భవతి కడుపులో కస్సక్కన కత్తి దించిన కసాయి తండ్రి

తమిళనాడు రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. కంటికి రెప్పాలా పెంచిన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని ఆ కన్నతండ్రి జీర్ణించుకోలేక పోయాడు. తన పరువు తీసిందంటూ తన స్నేహితుల వద్ద వాపోయాడు. ఈ క్రమంలో కుమార్తె గర్భందాల్చింది. అయినప్పటికీ అతనిలోని పగ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో నిండు గర్భంతో ఉన్న కుమార్తెను కత్తితో పొడవడంతో ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణ ఘటన మదురై జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదురై జిల్లా నాగయ్యపురానికి చెందిన గురునాథన్ (55) అనే వ్యక్తి స్థానికంగా వ్యవసాయ ఎరువుల వ్యాపారం చేస్తున్నాడు. ఈయనకు భార్యతో పాటు.. బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతూ మధ్యలో ఆపేసిన సుష్మ అనే 19 యేళ్ల కుమార్తె ఉంది. ప్రస్తుతం ఈమె ఇంటిపట్టునే ఉంటూ వస్తోంది. 
 
ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన శివశంకరన్‌ (23) అనే యువకుడితో పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఆమె ప్రేమలో పడింది. అయితే, ఇద్దరివీ వేర్వేరు కులాలు కావడంతో తల్లిదండ్రులు వ్యతిరేకించారు. అయినప్పటికీ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని వారిద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో ఇంట్లో చెప్పాపెట్టకుండా లేచిపోయిన ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. 
 
దీంతో పోలీసులు ఇరు కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. శివశంకరన్‌ను తమ అల్లుడిగా అంగీకరించేది లేదని సుష్మ తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అయితే, ప్రేమికులు మాత్రం పెళ్లి చేసుకుంటామని పట్టుబట్టడంతో పోలీసులే దగ్గరుండి వివాహం జరిపించారు. ఆ తర్వాత ఈ కొత్తదంపతులు వాళవందాన్‌‌పురంలో కాపురం పెట్టారు. 
 
ఈ పరిస్థితుల్లో గర్భిణి అయిన సుష్మ, భర్తతో కలిసి, ఆరోగ్య కేంద్రానికి పరీక్షల నిమిత్తం వెళ్లగా, అక్కడికి వచ్చిన సుష్మ తండ్రి, ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తూ, కత్తితో దాడి చేశాడు. ఆ వెంటనే శివశంకరన్‌ పరుగున వచ్చి, భార్యను పక్కకు లాగేసి, ఆమెను కాపాడాడు. సుష్మకు ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు, మెరుగైన చికిత్స కోసం తిరుమంగళం ఆసుపత్రికి పంపగా, పోలీసులు గురునాథన్‌ను అరెస్టు చేశారు.