శుక్రవారం, 5 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

టమోటా సాగుతో నెల రోజుల్లో కోటీశ్వరుడుగా మారిన రైతు

tomatto
దేశ వ్యాప్తంగా టమోటా ధరలు తారా స్థాయికి చేరుకున్నాయి. పెరిగిన ధరలతో జనం గగ్గోలు పెడుతుంటే టమోటా రైతులు మాత్రం తెగ సంతోష పడిపోతున్నారు. తాజాగా పెరిగిన ధరల పుణ్యమాని కొందరు రైతులు ఏకంగా కోటీశ్వరులై పోయారు. కేవలం నెల రోజుల వ్యవధిలో వారు ధనవంతులుగా మారిపోయారు. సాధారణంగా వ్యవసాయంలో కోట్లాది రూపాయలు అర్జించడం అనేది చాలా అరుదు. కానీ, దేశ వ్యాప్తంగా పెరిగిన కూరగాయల ధరల కారణంగా నెల రోజుల వ్యవధిలో ఈ ఇద్దరు రైతులు కోటీశ్వరులు అయ్యారు. 
 
వీరిలో ఒకరు మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన తుకారాం భాగోజి గాయకర్‌. ఈయన 12 ఎకరాల్లో టమోటా సాగు చేశారు. ఈ పంటపై సరైన అవగాహన ఉండడంతో దిగుబడి బాగా వచ్చింది. దీంతో నెల రోజుల్లోనే రూ.కోటిన్నరకు పైగా ఆదాయం సంపాదించారు. ఒక్కో పెట్టెను రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్‌ మార్కెట్‌లో విక్రయించారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 900 పెట్టెలను అమ్మి రూ.18 లక్షలు సంపాదించారు.
 
అదేవిధంగా మరో రైతు పేరు అరుణ్ సాహూ. ఛత్తీస్‌గఢ్‌ ధమ్‌తరీ జిల్లాలోని బీరన్‌ గ్రామ రైతు. ఈయన 150 ఎకరాల్లో టమోటా సాగు చేసి.. రోజుకు 600 నుంచి 700 పెట్టెలు విక్రయించారు. రూ.కోటికి పైగా ఈ నెల కాలంలోనే సంపాదించారు. ఉన్నత విద్య చదివిన సాహూ.. వ్యవసాయంపై మక్కువతో ఈ రంగంలోకి రాణిస్తున్నారు.