1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆహ్వానం... 11లోపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి...

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ తాజాగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ను రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆహ్వానించారు. 
 
తమ ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఫడ్నవీస్ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. కాగా, గత నెల 21వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ - శివసేన కూటమి అతిపెద్ద కూటమిగా అవతరించిన విషయం తెల్సిందే. అయితే, ఈ రెండు పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటుకు సయోధ్య కుదరలేదు. దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. 
 
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా, బీజేపీ-శివసేన కూటమికి 163 సీట్లు లభించాయి. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 103 స్థానాలు సంపాదించింది. ఇతరులకు 22 స్థానాలు లభించాయి. అయితే సీఎం పీఠంపై కన్నేసిన శివసేన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను తెరపైకి తెచ్చింది. సీఎం పీఠాన్ని పంచుకోవాలని కోరగా, బీజేపీ అంగీకరించలేదు. దాంతో ప్రభుత్వ ఏర్పాటులో విపరీతమైన జాప్యం ఏర్పడింది.
 
కాగా , సోమవారం బలనిరూపణ చేయాల్సిందిగా ఫడ్నవీస్ కు గవర్నర్ సూచించారు. అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా బీజేపీకి ఈ అవకాశం కల్పించారు. ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన 145 స్థానాల మార్కుకు సుదూరంగా నిలిచిపోయింది. శివసేన మద్దతిస్తేనే బీజేపీ సర్కారు గట్టెక్కనుంది.