బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (13:03 IST)

మోగిన ఎన్నికల నగారా : ఒకే దశలో రెండు రాష్ట్రాల పోలింగ్

కేంద్ర ఎన్నికల సంఘం మరోమమారు ఎన్నికల నగారా మోగించింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ రెండు రాష్ట్రాలు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్నాయి. 
 
ఈ ఇరు రాష్ట్రాల్లోనూ ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 27వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 
 
నామినేషన్లకు అక్టోబరు 4 చివరి తేది కాగా, నామినేషన్ల పరిశీలన అక్టోబరు 5న జరగనుంది. అక్టోబరు 21వ తేదీ పోలింగ్, 24వ తేదీన ఫలితాలు విడుదలకానున్నాయని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈసీ కఠిన నిబంధనలు విధించింది. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి వ్యయ పరిమితిని గరిష్టంగా రూ.28 లక్షలుగా నిర్ణయించారు. మహారాష్ట్రలో వ్యయ పర్యవేక్షకులుగా ఇద్దరిని నియమిస్తున్నట్టు ప్రకటించింది. నామినేషన్ పత్రంలో ఒక్క కాలమ్ వదిలినా నామినేషన్ రద్దవుతుందని, ఎన్నికల్లో ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. అభ్యర్థులు తమ ప్రచారంలో ప్లాస్టిక్ ఉపయోగించకూడదని ఆంక్షలు విధించింది. కాగా, శనివారం ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.
 
కాగా, నవంబరు 9వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ గడువులు ముగియనున్నాయి. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది ఓటర్లు ఉండగా, హర్యానాలో 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ రెండు రాష్ట్రాల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ఎన్నికల షెడ్యూల్:
సెప్టెంబరు 27న నోటిఫికేషన్
అక్టోబరు 4న నామినేషన్లకు చివరి తేది
అక్టోబరు 5న నామినేషన్ల పరిశీలన
అక్టోబరు 21 పోలింగ్
అక్టోబరు 24న కౌంటింగ్