1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (09:58 IST)

కోడిగుడ్లు అప్పు ఇవ్వలేదనీ బిర్యానీ సెంటర్ యజమాని కిడ్నాప్

kidnapers
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. కోడిగుడ్లు అప్పు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ బిర్యానీ దుకాణం యజమానిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ వ్యక్తిని ముక్తిధామ్‌కు తరలించారు. దీనిపై బాధితుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు.. కొన్ని గంటల్లోనే ఈ కిడ్నాప్‌ను ఛేదించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...  
 
రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా బర్తోరి గ్రామానికి చెందిన యోగేశ్ వర్మ అనే వ్యక్తి తమ గ్రామంలో బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు. ఈ దుకాణానికి కోహ్రాడా గ్రామానికి చెందిన దీపక్ చతుర్వేది, రాహుల్ కుమార్ భాస్కర్, పరమేశ్వర్ భరద్వాజ్ ఈ నెల 20వ తేదీన బిలాస్‌పూర్ గ్రామానికి వచ్చారు. తమకు కోడిగుడ్లు అప్పుగా ఇవ్వాలని కోరగా, అందుకు యోగేశ్ వర్మ అంగీకరించలేదు. దీనిని అవమానంగా భావించి యువకులు.. అదే రోజు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో యోగేశ్ వర్మను కిడ్నాప్ చేసి కారులో ముక్తిధామ్‌కు తీసుకెళ్లి, అతనిపై దాడిచేశారు. 
 
ఈ కిడ్నాప్‌పై బాధితుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు తక్షణం స్పందించి, కొన్ని గంటల్లో ఈ కిడ్నాప్‌ను ఛేదించి, యోగేశ్ వర్మను విడిపించారు. నిందితులపై కిడ్నాప్, దాడి, హత్యాయత్నం, బెదిరింపులు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.