శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (17:44 IST)

లక్కు అంటే వీడిదేరా బాబూ.. పర్సు పోగొట్టుకున్నాడు.. అయినా 36 కోట్లు వరించాయి..

సాధారణంగా నెలంతా కష్టపడి జీతం తీసినప్పుడు కలిగే ఆ అనుభూతి హాయిగా ఉంటుంది. అయితే అలాంటి జీతాన్ని ఉంచిన పర్సును ఎవడైనా దొంగతనంగా కొట్టేస్తే కలిగే బాధ వర్ణించడానికి మాటలు చాలవు. ఆ నెలంతా ఎలా గడుస్తుందో ఏమో అని దిగులు పడుతుంటారు. అలాంటి పరిస్థితిని లండన్‌కి చెందిన ఓ వ్యక్తి అనుభవించాడు. బాగా కష్టపడి సంపాదించిన శాలరీ మొత్తం పర్సులో పెట్టుకున్నాడు. 
 
డెబిట్ క్రెడిట్ కార్డులన్నీ కూడా అందులోనే ఉన్నాయి. అయితే తన పర్సును ఎవడో కొట్టేశాడు. పర్సు దొంగిలించిన వ్యక్తులు మార్క్ గుడ్‌రామ్, జానరస్ వాట్సన్‌లు మాత్రం డబ్బులన్నీ ఖర్చుపెట్టేసి అందులో ఉన్న డెబిట్ కార్డుని కూడా వాడేస్తున్నారు. అయితే ఈక్రమంలో వారు కొట్టేసిన ఈ డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి పది పౌండ్లు పెట్టి లోటో కంపెనీ వారి లాటరీ స్క్రాచ్ కార్డ్ కొన్నారు. 
 
మన లక్కు ఎలా ఉందో చూసుకుందామని స్క్రాచ్ చేసి చూసుకున్నారు. వచ్చిన నెంబర్ చూసి వారిద్దరికీ కళ్లు తిరిగినంత పనైంది. ఒకటీ రెండు కాదు ఏకంగా 4 మిలియన్ పౌండ్ల లాటరీ తగిలింది. అంటే దాదాపు రూ.36 కోట్లు అన్నమాట. ఇక ఈ చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేసి దర్జాగా బతుకుదామనుకుని ప్రైజ్ మనీ కోసం లాటరీ నిర్వాహకుల దగ్గరకు పరిగెత్తారు.
 
కాగా లాటరీ నిర్వాహకులు క్యాష్ మొత్తాన్ని బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తామని చెప్పి అకౌంట్ నంబర్ ఇమ్మని అడిగారు. దీంతో కాస్త తడబడ్డ దొంగలు అకౌంట్ నంబర్ లేదని చెప్పారు. లాటరీ యాజమాన్యానికి మాత్రం అసలు స్క్రాచ్ కార్డ్ వారిదేనా కాదా అనే అనుమానం వచ్చింది. స్క్రాచ్ కార్డ్ బిల్లుని అడిగేసరికి దొంగలు ఏమాత్రం తడబాటుకు లోనుకాకండా రసీదును తీసి ఇచ్చారు. 
 
స్క్రాచ్ చేసింది డెబిట్ కార్డు ద్వారా అని గుర్తించిన యాజమాన్యం కార్డు వారిది కాదని తెలుసుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి కూపీ లాగమన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు డెబిట్ కార్డు వ్యక్తిని పట్టుకున్నారు. రూల్ ప్రకారం డెబిట్ కార్డు ఎవరి పేరిట ఉందో వారికే రూ.36 కోట్ల ప్రైజ్ మనీ చెందుతుంది అని తేల్చేశారు. కష్టపడకుండానే కోట్లొస్తున్నాయి కదా అని ఆశపడితే కటకటాలపాలవ్వాల్సి వచ్చిందని పర్సు కొట్టేసిన దొంగలు లబోదిబోమంటున్నారు.