1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (10:52 IST)

ఎండీహెచ్ మసాల పొడులపై నిషేధం విధించిన ఆ రెండు దేశాలు! ఎందుకో తెలుసా?

Masala
ఎండీహెచ్‌, ఎవరెస్ట్ మసాలా ఉత్పత్తుల్లో ఇథలిన్ ఆక్సైడ్ క్రిమి సంహారకం ఉందంటూ ఆ మసాల పొడులపై సింగపూర్, హాంకాంగ్ దేశాలు నిషేధం విధించాయి. దీనిపై ఎండీహెచ్ స్పందించింది. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని ఎండీహెచ్ స్పష్టం చేసింది. తాము ఇథలీన్ ఆక్సైడ్ అస్సలు వినియోగించలేదని వినియోగదారులు, వ్యాపారుల్లో భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. 
 
క్రిమిసంహారకాలు ఉన్న కారణంతో ఎండీహెచ్ మసాలాలను సింగపూర్, హాంగ్‌కాంగ్ నిషేధించడంపై సంస్థ తాజాగా స్పందించింది. తమ మసాలా ఉత్పత్తుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ క్రిమిసంహారకం ఉందన్నది నిరాధార ఆరోపణ అని పేర్కొంది. అవన్నీ అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ ఉత్పత్తులు 100 శాతం భద్రమైనవని వినియోగదారులు, వ్యాపారులకు భరోసా ఇచ్చింది.
 
నిషేధానికి సంబంధించి తమకు సింగపూర్ లేదా హాంగ్ కాంగ్ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం అందలేదని ఎండీహెచ్ పేర్కొంది. అంతేకాకుండా, స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ వద్ద కూడా నిషేధానికి సంబంధించిన సమాచారం లేదని పేర్కొంది. కాబట్టి, ఎండీహెచ్ మసాలాల్లో క్రిమిసంహారకాలు ఉన్నాయన్న ఆరోపణలు నిరాధారమని పేర్కొంది. మసాలాల ఉత్పత్తి నుంచి అమ్మకాల వరకూ ఏ దశలోనూ తాము క్రిమిసంహారకాలు వాడమని స్పష్టం చేసింది.
 
సింగపూర్‌తో పాటు హాంగ్‌కాంగ్ కూడా ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాలపై నిషేధం విధించాయన్న వార్త ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రెండు బ్రాండ్ల ఉత్పత్తుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ ఉండడంతో నిషేధించినట్టు తెలిపాయి. ప్రజలు ఎవరెస్టు ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని హాంకాంగ్ ఆహార భద్రత నియంత్రణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్పత్తులను దేశంలో అమ్మొద్దని వ్యాపారులను కూడా ఆదేశించింది.