1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2024 (08:43 IST)

భార్య నుంచి (స్త్రీ ధనం) డబ్బు తీసుకుంటే భర్తలు తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు

supreme court
భార్య నుంచి డబ్బు (స్త్రీధనం) తీసుకుంటే భర్తలకు ఎలాంటి హక్కు లేదని, తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ కష్టకాలంలో వాడుకున్నప్పటికీ ఆ సొమ్మును తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఓ మహిళ నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలంటూ ఆమె భర్తను ఆదేశించింది. వివాహం సందర్భంగా తన పుట్టింటి వారు తనకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని, పెళ్లి తర్వాత తన తండ్రి తన భర్తకు రూ.2 లక్షల చెక్‌ ఇచ్చారని ఈ కేసులో ఓ మహిళ పేర్కొన్నారు. తొలిరాత్రి రోజున ఆ ఆభరణాలన్నింటినీ తన భర్త స్వాధీనం చేసుకున్నాడని చెప్పారు. 
 
భద్రపరుస్తానంటూ వాటిని తన తల్లికి అప్పగించాడని, ఆపై వారిద్దరూ తమకు అంతకు ముందే గల అప్పులు తీర్చడానికి వాటిని దుర్వినియోగం చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై తనకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందంటూ 2011లో ఓ కుటుంబ న్యాయస్థానం తీర్పిచ్చింది. దీనిని కేరళ హైకోర్టు కొట్టేయడంతో బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం.. స్త్రీ ధనం భార్యాభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తిపై భర్తకు ఎటువంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె ఆభరణాల దుర్వినియోగానికిగాను ఆమెకు రూ.25 లక్షలు చెల్లించాలని తీర్పిచ్చింది.