1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

న్యాయం చేయమని కోరితే నీ చెల్లెళ్ల వ్యక్తిత్వాన్ని హననం చేయిస్తావా? వివేకా సతీమణి సౌభాగ్యమ్మ

sowbhagyamma
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ ఓ బహిరంగ లేఖ రాశారు. తన భర్త వివేకా హత్యకు కారకులైన వారికి శిక్షపడేలా చేస్తా తనకు న్యాయం చేయమని కోరితే అది మీకు తప్పుగా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. అలాగే, వివేకానంద రెడ్డిని చంపిన వాళ్లను పక్కనేపెట్టుకుని, వారికి మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించడాన్ని ప్రశ్నించి మీ చెల్లెళ్లు వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలను వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే చూస్తూ మిన్నకుండిపోతావా అని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశంపై సౌభాగ్యమ్మ బుధవారం ఓ బహిరంగ లేఖ రాశారు. 
 
ఈ లేఖలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, "2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో.... 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన అంశం. మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం. హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈవిధంగా చూడటం. నీ పత్రిక, నీ టీవీ చానెల్‌, నీ సోషల్ మీడియా.. నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం.
 
చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది నీకు తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే, నీకు మాత్రం పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం... ఇది సమంజసమా? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్నాను. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున, చివరి ప్రయత్నంగా... న్యాయం ధర్మం ఆలోచన చేయమని నిన్ను ప్రార్థిస్తున్నా, వేడుకుంటున్నా. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని... ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా, న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్నా అని వైఎస్ సౌభాగ్యమ్మ రాసిన లేఖలో పేర్కొన్నారు.