గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (20:09 IST)

అన్‌లాక్-4 : మెట్రో రైళ్లకు - ఆన్‌లైన్ తరగతులకు రైట్ రైట్...

కరోనా వైరస్ ప్రభావం ప్రతి రంగంపై పడింది. ముఖ్యంగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. అయితే, దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోయినప్పటికీ రికవరీ రేటు మాత్రం బాగానేవుంది. దీంతో కేంద్రం అన్‌లాక్-4లో మరిన్ని వెసులుబాటు నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. ఇందులోభాగంగా, సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలకు అనుమతినివ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 
 
ఈ నెలాఖరు లోపు ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో గత మార్చి నెల చివరి నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై మరికొన్ని రోజులు నిషేధం తప్పేలా లేదు. ప్రత్యేక రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు, పాఠశాలలు, కళాశాలలు తెరిచేందుకు ప్రస్తుతానికి అనుమతినిచ్చే అవకాశాలు కనిపించడం లేదు. బార్లు తెరిచేందుకు కూడా ఇప్పట్లో అనుమతిచ్చే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టనప్పటికీ రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతుండటం కొంత ఊరట కలిగించే విషయం.
 
తెలంగాణాలో ఆన్‌లైన్ క్లాసులకు ఓకే 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. సెప్టెంబర్ 1న ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 27 నుంచి ఉపాధ్యాయులు కూడా క్రమంగా పాఠశాలలకు హాజరవుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాల విద్యార్థులకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిజిటల్ క్లాసులు ప్రారంభించనుంది. డిజిటల్ క్లాసులకు ఉపాధ్యాయులు ప్లాన్ సిద్ధం చేయనున్నారు. టీ-శాట్, దూరదర్శన్ వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా క్లాసులు బోధించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 31 తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.