శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : గురువారం, 28 మే 2020 (21:27 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త, స్వామివారి దర్శనం ఎప్పటి నుంచో తెలుసా?!

ఈ నెల 31వ తేదీన లాక్‌డౌన్ ఎత్తేసి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లని పరిశీలించారు టిటిడి పాలకమండలి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డి. 
దర్శనానికి వచ్చే భక్తులు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించేలా శ్రీవారి సేవకులతో పర్యవేక్షణ కొనసాగుతుందని టిటిడి పాలకమండలి ఛైర్మన్ చెప్పారు. ఎక్కడికక్కడ మైకుల ద్వారా కరోనా గురించి అప్రమత్తం చేయనున్నామన్నారు. క్యూలైన్లో ప్రతి భక్తుడికీ భక్తుడికీ మధ్య ఆరడుగుల దూరం ఖచ్చితంగా ఉండేలా మార్కింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.
రోజుకి ఏడువేల మందిని పంపే ఆలోచనలో టిటిడి ఉంది. గతంలో 60 నుంచి 80వేల మంది భక్తులు స్వామివారిని దర్సించుకునేవారు. శని, ఆదివారాల్లో అయితే ఆ సంఖ్య లక్షకు పైగా ఉండేది.

అయితే ఇప్పుడు కరోనా వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో భక్తుల సంఖ్యను తగ్గించేందుకు టిటిడి నిర్ణయం తీసుకుంది. మాస్క్‌లు, చేతులకి గ్లౌజులతో దర్సనానికి రావాలనేది తప్పనిసరి చేస్తున్నారు. అయితే వైరస్ ప్రభావంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం కూడా లేదని టిటిడి అధికారులే అభిప్రాయపడుతున్నారు.