గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (12:06 IST)

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం... రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి

car accident
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృత్యువాతపడ్డారు.  మరో 14 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు ఎగసిపడి బస్సు పూర్తిగా దగ్ధమైంది. గుణ-ఆరోన్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను చికిత్స కోసం గుణ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. 
 
ఆరోన్‌కు వెళ్తున్న బస్సు, గుణ వైపు వస్తున్న డంపర్ లారీలు రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిలో నలుగురు మాత్రమే పెద్దగా గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఈ ఘోర ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్రేషియా ప్రకటించారు.
 
ఈ ప్రమాదంపై విచారణకు ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతంకాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. అలాగే, ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని గుణ జిల్లా కలెక్టర్ తరుణ్ రాఠీ వెల్లడించారు.