ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (08:44 IST)

సీఎం అమరీందర్‌ మాట బేఖాతర్ ... పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్ధూ

కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఒత్తిడులు, నేతల సూచనలు, సలహాలకు తలొగ్గిన నిర్ణయాలు తీసుకునేది. కానీ, ఇటీవలి కాలంలో ఆ పంథాను మార్చుకున్నట్టుంగా తెలుస్తోంది. మొన్నటికిమొన్న తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా ఏ.రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ విషయంలో ఎన్నో రకాలైన ఒత్తిడులు వచ్చినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. 
 
ఇపుడు పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నియామకం విషయంలోనూ అలాంటి కఠిన నిర్ణయమే తీసుకుంది. పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవి ఖాయమంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌తో నెలకొన్న విభేదాల నేపథ్యంలో సిద్ధూకు పీసీసీ పదవి ఇచ్చి బుజ్జగించాలని కాంగ్రెస్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
 
దీనిపై స్పందించిన అమరీందర్.. సోనియాకు లేఖ రాస్తూ సిద్ధూను పీసీసీ పీఠంపై కూర్చోబెడితే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న హిందూ, దళిత వర్గాలకు చెందిన సీనియర్లకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపైనా ఈ ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
 
అయితే, ఆయన అభ్యంతరాలను పక్కనపెట్టిన సోనియా గాంధీ తాజాగా సిద్ధూను పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నియమిస్తూ గత రాత్రి  ప్రకటించారు. ఆయనతోపాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు.