1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 12 జులై 2021 (17:52 IST)

నిబద్దతకు మారుపేరు ఉదయలక్ష్మి, అందుకే పిలిచి మ‌రీ...

నిబ‌ద్ధ‌త గ‌ల ఐ.ఎ.ఎస్. అధికారిణిగా పేరొందిన బి. ఉదయలక్ష్మి రిటైర్ అయినా పిలిచి మ‌రీ పోస్ట్ ఇచ్చారు. ఏపీ సీఎం వై.ఎస్. జ‌గ‌న్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేసి రిటైర్డ్ అయిన బి. ఉదయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వ పోలీసు కంప్లైంట్స్ అథారిటీ మెంబరుగా నియమించ‌డంతో, ఆమె నేడు బాధ్య‌త‌లు స్వీకరించారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, అథారిటీ చైర్మన్ కనగరాజన్‌ని కలిశారు.
ఈ సందర్భంగా ఉదయలక్ష్మి మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేసింద‌న్నారు. తాను రాష్ట్రంలోని  పోలీసు అధికారుల పనితీరు బాగు చేయడానికి, కేసుల దర్యాప్తు లో పారదర్శకత్వానికి, ప్రజల పట్ల పోలీసులు భాద్యతాయుతంగా వుండటానికి పని చేస్తానని చెప్పారు. 
 
ఎవరైనా పోలీసు అధికారులు ఒక వ్యక్తి ప్రాణానికి, స్వేచ్చకు తీవ్ర విఘాతం కలిగిస్తే ఫిర్యాదు అందిన వెంటనే ఈ పోలీసు కంప్లైంటు అథారిటీ స్పందించి, వెంటనే తగు చర్య చేపట్టి ఆ వ్యక్తులను కాపాడుతుందని చెప్పారు.    
 
పేద కుటుంబానికి చెందిన స్త్రీలపై అత్యాచారం జరిగినప్పుడు, మైనరు బాలికను కిడ్నాప్ చేసినప్పుడు కొంతమంది పోలీసు అధికారులు, డబ్బుకు, ఒత్తిళ్లకు లొంగి, చట్ట ప్రకారం నిందితులపై వెంటనే చర్య తీసుకోకపోతే, అలాంటి ఫిర్యాదుల‌పై, తమ అథారిటీ వెంటనే చర్య తీసుకుంటుంద‌న్నారు.

సాధారణ ప్రజలు స్టేషనుకు వచ్చి, తమ వాహనం పోయిందనో, లేక ఇంట్లో దొంగలు పడి విలువైన ఆభరణాలు పోయినవనో ఫిర్యాదు చేస్తారు. కొంతమంది పోలీసు అధికారులు కేసులు రిజిస్టరు చేసిన తరువాత, అవి నిర్ణీత సమయంలో దొరకక పోతే, పైఅధికారులు తమకు ఛార్జ్ మెమోలు ఇస్తారని భయపడి, కేసులు ఎన్ని రోజులైనా రిజిస్టరు చేయటంలేదు. అటువంటి పరిస్థితులలో, సాధారణ ప్రజలు తమ పోలీసు కంప్లైంటు అథారిటీకి ఫిర్యాదు ఇస్తే వెంటనే చర్యలు చేపడుతామన్నారు.